Tuesday, August 27, 2013

తులసి- జలంధరుడు

హిందువులకు తులసి పవిత్రమైనది. ఇది దేవతా ప్రీతికరము. పూజాద్రవ్యములలో ఒకటి. దీనిచేత ఇతర దేవతలను పూజిస్తారు. ఇది దివ్యౌషధము. శ్రీకృష్ణ భగవానుడు తరుచు తులసి వనమునందు విహరించుచుండెడివాడు. దీనియొక్క గాలి స్పర్శవలన దీర్ఘాయుర్దాయము కలుగుతుంది. ఎవరింట్లో తులసివనం ఉంటుందో ఆ ఇల్లు సర్వ తీర్ధ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడికి రాలేరు.సర్వ పాప సంహారకమైన ఈ తులసివనాన్ని ఎవరు ప్రతిష్టిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు.అనగా, నరకానికి వెళ్ళరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావం. గంగాస్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం - ఈ మూడూ సమాన ఫలదాయకాలే. తులసిని ప్రతిష్టించినా, నీళ్ళు పోసినా, తాకినా సర్వ పాపాలూ నశిస్తాయి.
 

తులసి పుట్టుకకు పురాణ గాథను తెలుసుకుందాం.
కాలనేమి కూతురు బృంద. ఈమె చాలా అందగత్తె. రాక్షసరాజైన జలంధరునితో వివాహం జరిగింది. అనోన్య దాంపత్యము వీరిది. జలంధురుని గురువు రాక్షస గురువు అగు శుక్రుడు. అమృతపానం దేవతలు చేసినపుడు, రాహువుకూడా అమృతాన్ని తాగుతున్నప్పుడు రవి చంద్రులు చూసి విష్ణువునకు చెప్పడంవలన విష్ణు చక్రము చేత రాహువు తల ఖండించడం చేత, అప్పటికే అమృతము సేవించి యున్నందున రాహువు మృతము కానిది అమృతము కాబట్టి మృతి చెందని ఆ రాహువుయొక్క మొండెమునకు నాగుబాముతల అతికించాడా మహావిష్ణువు. అప్పటినుంచి సూర్య చంద్రులపై వైరి కలిగి యున్నాడు రాహువు. సూర్యచంద్ర గ్రహణములు ఈ రాహువలనే ఏర్పడుతుంటాయి. జలంధరుడు సముద్రుని పుత్రుడు లక్ష్మీదేవి యొక్క సోదరుడు. రాహువు యొక్క గాధను శుక్రునిద్వారా తెలుసుకొన్న జలంధరుడు, దేవతలపైకి దండెత్తి వారిని ఓడిపోయేలా చేస్తాడు.

దేవతలు అతన్ని జయించలేకపోవడానికి, కారణం పతివ్రత అయిన బృంద యేనని గ్రహిస్తారు . ఆ విషయం విష్ణువు కి తెలియజేస్తారు .

బృంద పాతివ్రత్యం చెడి పోతే గాని జలంధురుని జయించడం కష్టమని గ్రహించిన విష్ణు ... జలంధురుని రూపం లో బృంద దగ్గరికి వెళ్తాడు , వచ్చించి భర్తేనని భ్రమపడిన బృంద అప్పటిదాకా చేస్తున్న ధ్యానాన్ని వదిలేస్తుంది . దాంతో జలన్డురుడు ఇంద్రుని చేతిలో మరణిస్తాడు . అది తెలిసి బృంద కోపం తో విష్ణువును శిలవు(రాయి) కమ్మని శపిస్తుంది .

అప్పుడు విష్ణుమూర్తి, తులసి పూర్వ జన్మ గాధను వినిపిస్తాడు. తులసి గోలోకములోనున్న గోపిక. ఆమె గోలోక కృష్ణు నకు పరిచారిక. పైగా కృష్ణునకు ప్రియురాలు కూడ. ఒక పర్యాయము తులసీ కృష్ణులు శృంగార రస పారవశ్యములో ఉన్నారు. అప్పుడు అనుకోకుండా రాధాదేవి అక్కడకు వచ్చింది. తులసీ కృష్ణుల శృంగార చేష్టితాన్ని చూసింది. కోపం పట్టలేక పోయింది. వెంటనే తులసితో, 'ఓసీ! నీవు నా స్వామితో కలిసి ఉన్నావు. ఇది ఎంతో సాహసకృత్యము. నాకే కష్టము కలిగింప నున్నావు. కనుక, ఈ రాక్షస కృత్యానికి అనుగుణంగా నీవు రాక్షస వంశంలో జన్మించు' అని శపించింది. ఆ శాపవాక్కులకు తులసి విపరీతంగా బాధపడింది. శ్రీకృష్ణ సాహచర్యం ఇక తనకుండదని వాపోయింది. తులసి యొక్క మనోవేదనను అర్థం చేసికొన్న గోపాలకృష్ణుడు, 'ప్రియా! తులసీ! చింతించకు. రాధాదేవి ఇచ్చిన శాపం మరలించడం సాధ్యం కాదు, కాని , నీవు రాక్షస వంశంలో జన్మించినా, నా అంశతో జన్మించిన వానికే భార్యవౌతావు, చివరికి నా అనుగ్రహం వల్ల, తిరిగి నన్ను చేరతావు, 'అని ఓదార్చాడు.విష్ణువు తన భక్తురాలైన బృందను అనుగ్రహించి ఆమె తులసి చెట్టు గా అవతరించి అన్ని లోకాల వారిచేత పూజలన్డుకుంటుందని వరమిచ్చి మోక్షం ప్రసాదిస్తాడు . ఆ విధం గా బృంద తులసి చెట్టు గా పూజలందుకొంటుంది .

No comments:

Post a Comment