మంత్రం
ద్వారా, పూజ ద్వారా, ప్రాణాయామ యోగసాధన ద్వారా, యజ్ఞ యాగాదుల ద్వారా
ఎలాగైనా సిద్ధిని సాధించవచ్చు దైవశక్తిని దర్శించ వచ్చును.
"పసులవన్నె వేరు పాలేకవర్ణమౌ
పుష్పజాతివేరు పూజయొక్కటె
దర్శనంబు వేరు దైవంబు యొక్కటి
విశ్వదాభిరామ వినురవేమ"
అన్నాడు
వేమన. అలాగే ఊపిరిని ఆధారంగా ఉచ్చ్వాస నిశ్వాసలతో మంత్ర జపం
వున్నాలేకున్నా నిరాకార పరబ్రహ్మ తత్వాన్ని ఉపాసించినవారుకూడ వున్నారు. ఇది
అత్యంత ప్రాచీనమైన 'స్వర శాస్త్రం ', యోగంలో అతి ప్రధానాంగం. ఇక్కడ స్వర
శాస్త్రం అంటే సంగీతంలో స్వరం కాదు. ఉచ్చ్వాస నిశ్వాసల కలయిక స్వరం. ఇది
ప్రాణాయామానికి కూడా పై మెట్టు.
ఇప్పడికే
ప్రాణాయామం ద్వార యోగ సాధన చేయడం, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం మంచిదని
ప్రపంచం అంతా గుర్తించింది. ఈ పద్దతులని ఈనాడు శాస్త్రబద్దంగా
ఋషిప్రోక్తమైన విధానాలకి అనువుగా అనేక మందికి నిజమైన ఆరోగ్యాన్ని
పొందుతున్నారు. సక్రమమైన సాధనా పద్ధతిని అందిచే కృషి చేస్తున్నారు, పతంజలి,
వసిష్టుడు వంటి ఋషులు అందించిన యోగ సూత్రాలను మానవాళి అభ్యున్నతికి
వాడుతున్నారు. అందులో తెలుగు గడ్డపై జన్మించి తెలుగులో యోగాన్ని అందించిన
వేమన, వీరబ్రహ్మం గారు, గణపనారాధ్యుడు లాంటి వారిని మనం మరిచిపోలేం.
ఆశ్చర్యమేమిటంటే దాదాపు క్రీ.శ.1295 ప్రాంతానికే గణపనారాధ్యుడు 'స్వర
శాస్త్రమంజరి ' అన్న గ్రంధాన్ని తెలుగులో రచించాడు, మూలమైన యోగసాధనలని
తెలుగులో అందించాడు. బ్రౌన్ దొరగారు 1845 లో ప్రాచ్య లిఖిత గ్రంధాలని
మద్రాసు లిటెరరీ సొసయిటికి అందించినప్పుడు ఈ తాళపత్రం కూడా అక్కడికి
చేరింది. గణపనారాధ్యుడు చెప్పిన ప్రాణాయామ 'నాడీ శోధన ' ఇలా వుంది .
"అరుణ సూర్యోదయంబున నప్పుడే లేచి
కూర్చుండి పవనంబు గూర్చి శొధించి
నాళ్ళను శుద్ధిగా జేసి శుభ తత్వములతోడ "
గణపనారాధ్యుడు
కేవలం ప్రాణాయామం యోగం కాదని వాయు సాధనలో మనసు శివుని మీద (సర్వేశ్వరుని
మీద) లగ్నం చేయాలని ధ్వనించాడు. పద్మాసనంలో నిటారుగా కూర్చొని సాధన
చెయ్యాలి అని చెప్పాడు.
"పవ్వాసనంబున బైనికవెట్టి
వీపును విరుచుచు వీపు నిక్కుచును
వాయువుల్ పట్టుచు వదలుజేయు
చుండుట యోగమే? యుండగోరెదవు
శివుతోడ గూడక శివయోగి యగునే? "
గణపనారాధ్యుడి
నుండి వేమనకు, వేమననుండి వీరబ్రహ్మం గారి వరకు 'కుండ ' అన్న మాట
కుండలినికి పర్యాయ పదంగా వచ్చింది. కుండలిని సాధనతో వైరాగ్య మోక్షాలని
పొందమని ఈ యోగమూర్తులు చక్కని తెలుగులో చెప్పారు.
గణపనారాధ్యుడు:
"నీ కట్టినింటిలో నీ కుండ కలదే?
పరమార్ధ సంపద పరికింప వేల?
అస్థిర సంపద లమర నేమిటికి?
ముక్తి కామిని యుండ మూర్ఖవై కోరి? "
వేమన: కింది పద్యంలో రెండు అనగా నాడుల సంకేతంగాను, కుండ అంటే కుండలిని సంకేతంగాను చెప్పాడు.
"రెండు రెండు రెండు రెండు రెండును వీడి
రెంటి మీదనున్న యొంటి లెక్క
కుండలోన జూచి గుడి సుఖంబుననుండు
విశ్వదాభిరామ వినుర వేమ"
పోతులూరి వీర బ్రహ్మం గారు:
"కుండ భేదించరా గురుని నీలో తెలియర కుండలి పైగ నుండి చంద తేజము గాంచరా"
ఈ
వీర బ్రహ్మం గారి పద్యంలో 'కుండలి పైగ నుండి చంద తేజము ' రహస్యము,
అలోచింపదగిన సాంకేతికార్ధము. కుండలినిని సాధించి, ఆజ్ఞా చక్రము నుండి
సహస్రారము వైపు సాగిన తరువాత యోగికి అమృతత్వ సిద్ధి కలుగుతుందిట. ఈ
సిద్ధికి మూలమైన యోగ శక్తి కుండలిని సహస్రారం చేరిన తరువాత బిందువులు
బిందువులు గా పడుతుంది, యోగికి తెలుస్తుంది - అతని సాధనా సంపత్తి వల్ల
యవ్వన వంతునిగానో, శక్తి సంపన్నుని గానో మహా యోగి అయితే చిరంజీవి గానో
చేస్తుంది. ఈ అమృతత్వ సిద్ధి వల్లనే యోగులు వందల, వేల సంవత్సరాలు ఇంకా
యుగాలు కూడా జీవిస్తున్నారుట. ఈ అమృత సిద్ధినే అమృత భాండంగా వర్ణించారు.
అమృత భాండాన్ని 'చంద్ర వంక 'గా చిత్రీకరించడం, కవులు వర్ణించడం చేసారు.
అందుకే హాలాహలం పుట్టాక శివుని తలమీద (సహస్రార చక్రం దగ్గరన్న మాట)
చల్లదనంకోసం అమృత భండాన్ని పెట్టారు. అప్పుడు శివుడు 'సోమ శేఖరుడు '
అయ్యాడు. సోమ రసము అంటే అమృతమని మనకి తెలుసు కదా! చంద్రునికి 'సోముడు 'అని
పేరు, సోమవారం కూడా ఆయనదే! అందుకే శివుడు 'చంద్ర శేఖరుడు 'కూడా అయ్యాడు,
సోమవారం ఆయనకి ప్రీతికరమైనది.మరి చంద్రుడు సుధాకరుడయ్యాడు. ఈ అమృతం కోసమే
దైవ శక్తులు, అసురీ శక్తులు క్షీర సాగరాన్ని మధించాయి, మహా సర్పమైన
వాసుకిని తాడుగా వాడుకున్నాయి. శ్రీ మహా విష్ణువే స్వయంగా కూర్మంగా తర్వాత
జగన్మోహినిగా రావాల్సి వచ్చింది.
ఇందులో
నిగూఢార్ధాలు చాలా వున్నాయి. జీవి దేహము, పోషణావసరమున్న ఈ భౌతిక ప్రపంచమే
క్షీర సాగరం. కూర్మావతరం - గట్టి నిశ్చయం, పతంజలి యోగ సూత్రాలలో చెప్పిన
'కూర్మ నాడి 'అనే సిద్ధి. వాసుకి, పాము కుండలిని శక్తి అని వేరే
చెప్పక్కర్లేదు. ఇక దేవతలు, రాక్షసులు ఎవరూ అంటే భగవత్గీతలో దైవాసుర
సంపద్విభాగయోగంలో చెప్పినట్టు మనిషిలో కలిగే సత్ చింతనే దేవతాశక్తి,
భావదారిద్ర్యం వల్ల కలిగేది-మానవత్వానికి దూరమైనది దానవ శక్తి. క్షీర సాగర
మధనమే సాధన, తపస్సు. తపస్సు ఫలితంగా ముందు పూర్వజన్మ కృతమైన పాపం హాలాహలం
లోకాలన్నిటి ముంచేస్తుంటుంది. అంటే మానవుడు మహోన్నతమైన లక్ష్యాలని
సాధించాలని బయలు దేరితే ముందు పూర్వజన్మలో అంటే ముందు 'కాలం 'లో విష
కర్మలన్ని 'కాలకూట 'విషంగా వచ్చి మనిషిని నిస్తేజునిగా చేస్తుందన్నమాట. ఆ
విషాన్ని, అంటే కాలకూట మైన కర్మని హరుడు వచ్చి హరిస్తాడు. ఆ విషాన్ని
హరించిన హరుడు శ్రీకరుడౌతాడు. 'శ్రీ ' అంటె సంస్కృత భాషలో ఒక అర్ధం విషం.
శ్రీకరుడైన శంకరుడు అలా పాత పాపాలని హరించి కొత్త జీవితాని కి శ్రీకారం
చుడతాడు. అలా కల్లోలాన్ని, జీవన ప్రళయాన్ని పోగొడతాడుకనక ఆయన్ని 'శం కరుడు '
అన్నాం. శం అంటే శాంతి అని అర్ధం. శంకరుడు అంటే శాంతిని కలిగించేవాడు అని
అర్ధం. ఆయన తన జ్ఞాన నేత్రం ఇచ్చి కళ్ళు తెరిపిస్తాడు,దివ్యదృష్టిని
ఇస్తాడు. దివ్యదృష్టి అంటే కళ్ళుమూసుకుని ఎక్కడి విషయాలో చెప్పడం కాదు,
దివ్యంగా దర్శించగలగడం. అంటే దేముడిలా విషయాలని మైత్రి, కరుణ, ముదితలతో
చూడగలగడం.
దేవతలు,
దానవులు అందరూ సాధనచేస్తారు. కేవలం దేవలకే అమృతత్వ సిద్ధి కలగాలి. మరి ఈ
ప్రపంచంలో అంతా కలిసే వుంటాయి కదా! వాటిని వేరుచేయడం ఎలా? అందుకే
శిష్యున్ని పరిక్షించకుండా గురువు విద్యనివ్వడు, భక్తుడిని పరిక్షించకుండా
దేవుడు వరమివ్వడు. 'ది లాస్ట్ టెంప్టేషన్ ' పరీక్షించడానికి జగన్మోహనుడైన
మాయకాడు మహావిష్ణువు జగన్మోహినిగా వస్తాడు. అరిషడ్వర్గాలని జయించిన రాజయోగి
యోగిరాజై మోహబంధాలకి చిక్కక పరాముక్తుడౌతాదు, సాక్షాత్ పరమేశ్వరుడు
అవుతాడు, పరమాణువులో అద్భుతశక్తిని, పరిభ్రమించే గ్రహ నక్షత్ర
గోళాలకుమించిన ఆ పరాశక్తిని సాక్షాత్కరింపచేసుకుంటాడు. ఇలా మంచి చెడులని
విడకొట్టే శక్తిని పొందిన యోగిని 'పరమహంస ' అని అంటున్నాం. ఎందుకంటే పాలని,
నీళ్ళని విడకొట్టే సహజ శక్తి హంసకే వుందిట.
మనశ్శాంతి
లేని వారు చంద్రుడిని ధ్యానిస్తే మండలం రొజుల్లో ఫలితం కనిపిస్తుందని
శాస్త్రం చెపుతోంది. ఆటిజం వంటి సమస్యలకు ఈ మంత్రాన్ని బుధ మంత్రంతో బాటు
సాధన చేసి ఆ శక్తిని ధారపోస్తే చెప్పుకోదగిన ఫలితం వుందని లోక క్షేమం కోరే
కొందరు మంత్ర సాధకులు చెపుతున్నారు.
No comments:
Post a Comment